పండుగ కానుక గా పిఆర్సి ప్రకటించాలి
* తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి
ఉద్యోగులు న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీఎం కేసీఆర్ తరుపున సంక్రాంతి పండుగ కానుక కోసం ఎదురుచూస్తున్నారని, పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి అన్నారు. పీఆర్సీ అంశంలో ఇంకా తేల్చడం లేదని, ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు నివేదిక కాపీ ఇవ్వాల్సి ఉండగా ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఈఓ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉద్యోగవర్గాలు ఉద్యమ సమయంలో వచ్చే పండుగలన్నీ సొంత
రాష్ట్రంలోనే జరుపుకుంటామనే ఆశతో ఉండేవారని, ఇప్పుడు కూడా రెండేండ్ల నుంచి పీఆర్సీకి కోసం అదే విధంగా ఎదురుచూస్తున్నారన్నారు. 2018 జూన్ నుంచి పీఆర్సీ అంశం తేలడం లేదని, వేతన సవరణ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ వర్గాల సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్ తొలిసారి 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, ఈసారి కూడా అదే ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. గతనెల 30న పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇచ్చారని, కానీ సీఎస్తో సహా ముగ్గురు ఉన్నతాధికారులను దానిపై అధ్యయనం చేసి, వారం రోజుల వ్యవధిలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సూచించారని, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలువడం లేదన్నారు. ఈ సంక్రాంతి పండుగ వరకు సీఎం నుంచి శుభవార్త వస్తుందనే ఆశతో ఉద్యోగులు ఉన్నారని, ఉద్యోగులకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారు.